నేటి సాక్షి,బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)బాపట్ల తూర్పు సత్రం స్థలం అద్భుత సుందరీకరణ చేస్తానని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రాన్ని పరిశీలించి చేపట్టబోయే అభివృద్ధి కార్యమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ బాపట్ల పట్టణ దాత, వందల ఎకరాలను పేదల కోసం దానం చేసిన మహనీయుడు పేరం గరుడాచలం నాయుడు జ్ఞాపకార్థం తూర్పు సత్రం స్థలాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రకటించారు. బుధవారం తూర్పు సత్రం స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కమిటీతో పాటు, తూర్పు సత్రం నిర్వహణ కోసం మరొక 9 మందితో కూడిన ప్రత్యేక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. స్థలంలో క్రమబద్ధమైన షాపుల నిర్మాణం చేపడతాం. ప్రజల కోసం అత్యాధునికమైన సింథటిక్ వాకింగ్ ట్రాక్, అందమైన పార్కు ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతం మొత్తాన్ని “పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం” పేరుతో పట్టణంలోనే ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దుతాం.”బాపట్ల పట్టణ అభివృద్ధికి భూములు దానం చేసిన గొప్ప వ్యక్తుల ఆశయాలను గౌరవిస్తూ, ఆయా ఆస్తులను పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం మా బాధ్యత” అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.70 లక్షల వ్యయంతో కర్మకాండలు చేయడానికి పురాణ కాలక్షేప మండపం నిర్మిస్తున్నామని త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలియజేశారు. ఆక్రమణలకు తావు లేకుండా, పారదర్శకమైన కమిటీల ద్వారా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, తూర్పు సత్రం చైర్మెన్ తులసీ కుమారి, జనసేన నాయకులు విన్నకోట సురేష్, తూర్పు సత్రం మెంబెర్స్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.





