నేటి సాక్షి, ఎండపల్లి:* బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై పి.ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ, రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల్య వివాహాల నిర్మూలన ప్రచార రథాన్ని బుధవారం ఎస్సై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. “18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం జరిపించడం చట్టవిరుద్ధం. బాల్య వివాహం నిర్వహించినా, సహకరించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని, గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ప్రచార రథంతో వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లో పర్యటించిన సంస్థ ప్రతినిధులు పలు గ్రామ పంచాయతీ, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్యం అమూల్యమైన దశ అని, బాల్య వివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక-మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్చంద సంస్థ కోఆర్డినేటర్ పోలవేణి భూమేష్, కమ్యూనిటీ మొబైలైజర్లు లత, శ్యామల, లహరి, ఆయా గ్రామాల పంచాయతీ ప్రజా ప్రతినిధులు, కార్యదర్శిలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

