నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలుగు రాష్ట్రాల్లోని బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే, అంబేడ్కర్-మండల్, కర్పూరీ ప్రాంగణంలో బీసీ సింహ గర్జన నిర్వహించనున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బొడ్డు వెంకన్న యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక జ్యోతిరావు ఫూలే భవన్ లో ఈ సభకు సంబంధించిన పోస్టర్లను బుధవారం బిసి సంఘం నాయకులతో కలిసి, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్ళు అయిన బీసీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. బీసీలు సామాజిక వివక్షకు గురికావడమే కాకుండా, వారిపై దాడులు కూడా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బీసీలకు రక్షణ చట్టం తేవాలన్నారు. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, వారి అభివృద్ధికి ఖర్చు చేయాలని, బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో మరియు చట్టసభల్లో 44శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రాజధాని ప్రాంతంలో బీసీ కులాలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. బీసీ సింహ గర్జనకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు మురళి యాదవ్, సామాజికవేత్త డాక్టర్ రాజు, రాపోలు సత్యనారాయణ, కొండా రాంబాబు, సురేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బోయపల్లి రవీంద్ర గౌడ్, అనిల్ కుమార్ గౌడ్, దాసరాజు జయరాజ్ ముదిరాజ్, విద్యార్థి నాయకులు వేణుమాధవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

