నేటి సాక్షి పాలేరు, నవంబర్ 07:డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సిద్ధాంతాలు, విలువలు, స్వప్నాలు ప్రేరణగా… ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం దానవాయిగూడెంలోని బాలికల గురుకులంలో వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “ఒక వ్యక్తి ఎదిగితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది… కుటుంబం ఎదిగితేనే సమాజం, దేశం ఎదుగుతుంది.” అని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లల్లో ఉన్న భయం, సందేహాలను తొలగించి, స్పష్టమైన లక్ష్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం అనే మూడు మంత్రములు జీవిత విజయానికి పునాది అని సూచించారు. కష్టాలు వచ్చినప్పుడల్లా తలవంచి వెనక్కి తగ్గడం కాకుండా, మేల్కొని ముందుకు సాగాలని ప్రేరణనిచ్చారు. కర్తవ్యబాధ్యత, క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రేమ-త్యాగాల గొప్పతనం పై తీసుకున్న పలువురు వక్తల ఉపన్యాసాలు విద్యార్థినిలను కదిలించాయి. కొంతమంది విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల గురించి మాట్లాడేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ దుర్గ, అధ్యాపక బృందం, డైరెక్టర్లు దాసరి రంజిత్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





