నేటి సాక్షి నారాయణపేట, మార్చి 31, (రిపోర్టర్ ఇమామ్ ),నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం, తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి 4 వ తేదీ వరకు నిర్వహించబడుతున్న ప్రసిద్ధ భావోజి జాతర సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు. మంగళవారం రోజు జాతర నిర్వహణను సమగ్రంగా పరిశీలించిన ఎస్పీ, పోలీస్ అధికారులకు పలు కీలక సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తేరు కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నలుగు దిక్కుల రోప్ పార్టీలు ఏర్పాటు చేయాలని, ముందస్తు బందోబస్తు ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయబడినట్లు, వాహనాల పార్కింగ్ కోసం వేర్వేరు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.జాతరలో భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి సంఘటనలను అరికట్టేందుకు మఫ్టీలో (సివిల్ డ్రెస్సులో) పోలీసులను మోహరించామని తెలిపారు. అదనంగా, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు క్యూఆర్టి టీం ఏర్పాటు చేయాలని, జాతర ప్రాంగణంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, భక్తులు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.జాతర సమయంలో ప్రజలు పోలీస్ అధికారులతో సహకరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్, ఎస్సై నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





