నేటి సాక్షి,కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కొఠారి గ్రామంలో కబడ్డీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ‘శ్రీ శ్రీ శ్రీ పోతరాజు యూత్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ టోర్నమెంట్ను ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ శనివారం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.గ్రామానికి చేరుకున్న శ్యామ్ నాయక్ గారికి గ్రామస్థులు, యువత డోలు వాయిద్యాలు మరియు గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారితో కాసేపు ముచ్చటించి వారిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి గ్రామీణ క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కబడ్డీ మన మట్టి క్రీడ అని, ఇది శారీరక దృఢత్వంతో పాటు క్రీడాకారుల్లో క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి మరియు క్రీడాకారుల ప్రోత్సాహానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.అనంతరం నిర్వాహకులు శ్యామ్ నాయక్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, ఉప సర్పంచ్ చాహకటి ఆనంద్ రావు, గ్రామ పటేల్ మాడవి భీము, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విశ్వనాథ్ పాల్గొన్నారు. అలాగే నిర్వహణ కమిటీ సభ్యులు మాడవి రాము, ఆత్రం శేఖర్, రాజు, శంకర్, భీం రావు, లక్ష్మణ్ మరియు గ్రామస్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

