నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 24) : వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతులు కష్టపడి పండించిన వడ్లను ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అలాగే సన్న వడ్ల కొనుగోలు కూడా జరుగుతుందని, రైతులకు ప్రభుత్వం బోనస్ అందజేస్తుందని పేర్కొన్నారు. రైతులు మిల్లర్లతో మాట్లాడుకోవాలని ఎవరు చెప్పినా అది తగదు. మిల్లర్లతో మాట్లాడే బాధ్యత అధికారులదే రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ అన్నగా నాదే బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్ల నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగి రెడ్డి తిరుపతిరెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.





