-నల్ల బ్యాడ్జిలతో నిరసన భారీ ర్యాలీ
-డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
నేటిసాక్షి, మిర్యాలగూడ : మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై బిఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ, మిర్యాలగూడ జర్నలిస్టులు నల్ల బ్యార్జీలతో భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాగర్ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి, ఆర్టీసీ బస్టాండ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. మీడియాపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలంటూ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ, నినాదాలు చేస్తూ, జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మహానగరంలో నడిబొడ్డున మహా న్యూస్ కార్యాలయం పై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ, ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాపై అనేకచోట్ల జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. మహా న్యూస్ కార్యాలయంపై రాళ్లు, ఇనప రాడ్లు, కర్రలు ధరించి మూకుమ్మడిగా దాడి చేయడం, సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అణచివేసే ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర లేకుండా ముందుకు పోలేమని, అనేక సందర్భాలలో బారాస అధినేత ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని. తిరిగి ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు నిజాలను జీర్ణించుకోలేక మీడియాపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్యఅని అన్నారు. దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.





