నేటి సాక్షిబెజ్జంకి మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు ఆర్థిక బలం కల్పించే ప్రత్యేక విధానాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఇందిరమ్మ సన్న బియ్యం పంపిణీతో పాటు, నాణ్యమైన చేనేత చీరలను మహిళలకు అందజేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్య కార్యక్రమమని తెలిపారు.“మహిళా శక్తి బలపడితేనే తెలంగాణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కోటి మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నాం. ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారి లక్ష్యం కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే,” అని ఎమ్మెల్యే చెప్పారు.కార్యక్రమంలో భాగంగా 14 మంది మహిళలకు ఇన్సూరెన్స్ ప్రయోజనాల కింద చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీపీఏం విద్యాసాగర్, తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ప్రవీణ్, ఏపీఎం పరుశరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు బైర సంతోష్, యూత్ నాయకులు కర్రావుల సందీప్, బోనగం రమేష్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.





