నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం “మాత పితృ వందనం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి పదో తరగతి విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో హాల్ టికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాద పూజ చేసి దీవెనలు పొందారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆశీర్వాదాలు అందిస్తూ రాబోయే పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ మారం సునీత-జలేందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల దీవెనలు పొందడం విద్యార్థులకు ఎంతో ప్రేరణనిస్తుందని, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలపై సూచనలు అందిస్తూ సమయపాలనతో చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం ఆయన విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి కళ్యాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.





