నేటి సాక్షి చెన్నూర్ లో తప్పుడు పద్దతిలో మార్వాడీలు పొందిన బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని బీసీ జేఏసీ చెన్నూరు చైర్మన్ సిద్ది రమేష్ అన్నారు. అధికారులు ప్రలోభాలకు లొంగి తప్పుడు పద్దతిలో కుల ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ, వ్యాపారాల నిమిత్తం చెన్నూరుకు వచ్చిన మార్వాడీలు దొడ్డి దారిన బీసీ సర్టిఫికెట్లు పొంది తమ ప్రభుత్వ ఫలాలను పొందడమే కాకుండా నేడు తమ పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి తమపై ఆధిపత్యం చలాయించాలని చూస్తే చెన్నూరు ప్రజలు చూస్తూ ఊరుకోబోరని, తక్షణమే మార్వాడీలు తప్పుడు పద్ధతిన పొందిన బీసీ సర్టిఫికెట్లను రద్దు చేసుకొని బెదిరింపులకు పాల్పడిన మార్వాడి శ్యామ్ సుందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు చాకినారపు మల్లేష్, బీసీ జేఏసీ నాయకుడు అక్కల రాజన్న, ఎర్రోళ్ల సంజీవ్, మాల మహానాడు నాయకుడు నవీన్, జేఏసీ నాయకులు మామిడాల పోచం, అడ్లూరి సమ్మయ్య, గండ్లకోట నాగేష్, అక్కల కిట్టేష్ తదితరులు పాల్గొన్నారు.





