నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి ప్రెస్ క్లబ్, అక్టోబర్ 17 :ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అన్నారు. సామాజిక మాధ్యమాలను కూడా మంచి పనుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు. ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో పలువురు సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అరవ జయపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సుధీక్ష గ్రూప్ కంపెనీల అధినేత, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ – డా. వి.వి గిరిల మనవడు డాక్టర్ గౌరవరం సుబ్రహ్మణ్యం శర్మ పాల్గొని ప్రసంగించారు. విశిష్ట అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, విశ్రాంత లెక్చరర్ కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ సి. నారాయణస్వామి హాజరై మాట్లాడారు. సమాజ అభివృద్ధి శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా సహకారం మరువలేనిదని ఎస్పీ అన్నారు. మీడియా సంస్థలు, జర్నలిస్టులు అందించే సహాయం ఎంతో విలువైనదని, ఎప్పటికీ గుర్తుండిపోయేదని అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. మీడియా సహకారంతోనే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. శాంతిభద్రతలు, జిల్లా అభివృద్ధి వంటి అంశాలలో అధికారులకు మీడియా తన వంతు సహకారం అందిస్తుందన్నారు. డాక్టర్ సుబ్రమణ్య శర్మ మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ సంఘటనలను ప్రజల ముందుంచడంలో మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. జర్నలిస్టులకు సహకరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. తన సంస్థల ద్వారా ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించానని వివరించారు. ఈ సందర్బంగా జర్నలిజం ప్రాముఖ్యతను వివరించేలా అరవ జయపాల్ రాసిన చైతన్య గీతాన్ని కళాకారులు చలపతి, సుమతి, కృష్ణకుమారి బృందం ఎంతో చక్కగా ఆలపించారు. అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల జర్నలిస్టులు, ఉప సంపాదకులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వెటరన్ జర్నలిస్టులు, విశ్రాంత పాత్రికేయులు, కవులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




