*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో జగిత్యాల జిల్లా పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా సాగేలా తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.నామినేషన్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన భద్రతాపరమైన సూచనలు చేశారు. అభ్యర్థులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ పర్యటనలో అదనపు ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, ఇన్స్పెక్టర్లు చిరంజీవి,కరుణాకర్, అనిల్ కుమార్తో పాటు సంబంధిత ఎస్ఐలు పాల్గొన్నారు.____





