నేటి సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల పరిధిలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐ.పి.ఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల సమయంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇతరులను అవహేళన చేసే వ్యాఖ్యలు, అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, అలాగే ఇతరుల మనోభావాలను దెబ్బతీసే వాక్యాలు, వీడియోలు లేదా ఫొటోలు పోస్టు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.అలాగే ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేయడం నేరమని, అటువంటి చర్యల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, అభ్యంతరకర పోస్టులు లేదా సందేశాలు కనిపిస్తే ప్రజలు వెంటనే జిల్లా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇందుకోసం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ను 8712670505 / 551 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించి, పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.





