నేటి సాక్షి గజ్వేల్, ఫిబ్రవరి 18: గజ్వేల్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు దారితీశాయి. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని వారు స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీపై బురద జల్లే ప్రయత్నం రాజకీయ దివాళాతనమని ధ్వజమెత్తారు.తూప్రాన్ మున్సిపాలిటీలో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లను డబ్బులతో కొనుగోలు చేశారనే ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. “మూడు కోట్ల రూపాయలు ఇచ్చారని చెబుతున్నావు… అయితే ఆధారాలు ఎక్కడ?” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఆధారాలు లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ రెడ్డి గత రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ పార్టీ మార్పులు, డబ్బు ఆరోపణలపై ముందుగా సమాధానం చెప్పాలని అన్నారు. గత ఎన్నికల సమయంలో హరీష్ రావు, కె. చంద్రశేఖర్ రావు పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాజకీయంగా లాభం కోసం ఆరోపణలు చేయడం గజ్వేల్ ప్రజలు సహించరని హెచ్చరించారు.“కోట మైసమ్మ ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా?” అంటూ మరోసారి సవాల్ విసిరిన బీజేపీ నేతలు, నిరాధార ఆరోపణలు కొనసాగితే గజ్వేల్ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ , ఏల్కటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నాయిని సందీప్ , వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు మరియు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.గజ్వేల్ రాజకీయాల్లో ఈ తాజా పరిణామాలు మరింత ఉద్రిక్తతకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.

