🔥నేటి సాక్షి మహబూబాబాద్ ఫిబ్రవరి 16 మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండలం మెగ్యాతండా గ్రామంలో బంజారాల ఆరాధ్య దైవం అయిన సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి వేడుకలను సేవాలాల్ సేన మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.“భోగ్ బండారో.. లాగ భోగ్ కట్ రోగ్..” అంటూ బంజారా సంప్రదాయ నినాదాలతో, డోలు తాళాల మధ్య బంజారా సాంప్రదాయ నృత్యాలు, భజనలు నిర్వహించి వేడుకలను ఉత్సాహభరితంగా జరిపారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా సేవాలాల్ సేన మండల అధ్యక్షులు బాదావత్ సురేష్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు భూక్య చిరంజీవి మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ చూపిన ధర్మమార్గం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడవాలని, బంజారా తండాల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి బంజారా కుటుంబం పాడి పంటలు, పశువులతో సంతోషంగా ఉండాలని ఆశీర్వాదాలు కోరారు.అలాగే ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ, ఆ నిధులను రూ.10 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. మండల వారీగా జయంతి నిర్వహించే ప్రతి కమిటీకి సమానంగా నిధులు పంపిణీ చేయాలని, నిధుల దుర్వినియోగం జరగకుండా పారదర్శక వ్యవస్థ అమలు చేయాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.అన్ని మతాలను గౌరవించినట్లే బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని నేతలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాదావత్ జయప్రకాష్, మాజీ సర్పంచ్ బాదావత్ జ్యోతి రాము, వార్డు సభ్యులు గూగులోతు సావిత్రి రఘు, బాదావత్ బద్రి లక్ష్మణ్, బాదావత్ వెన్నెల శ్రీకాంత్, బాదావత్ బుజ్జి రెడ్డి, బాదావత్ మంగీలాల్, గ్రామ శాఖ అధ్యక్షులు బాధావత్ శివశంకర్, గూగులోత్ బిక్కు, అంకు, భాష, మల్చూర్, చంద్రు, శ్రీరామ్, వీరన్న, వాల్యూ, మురళి, శివాజీ, సాగర్, మంగ్యా, నరేష్, భాస్కర్, బద్రు ఈర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. తండా పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేశారు.





