నేటి సాక్షి – ఇబ్రహీంపట్నం*( రాధారపు నర్సయ్య )మైక్రో ఫైనాన్స్ అప్పుల భారం మరో కుటుంబాన్ని వీధిన పడేసింది.!వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కలకలం రేపింది.*అప్పుల కోసం బంగారం కుదువపెట్టిన భార్య*మండల కేంద్రానికి చెందిన లక్కం రాజశేఖర్ గత కొంతకాలంగా మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పులు తీసుకున్నట్లు సమాచారం. వాయిదాలు చెల్లించలేకపోవడంతో సంస్థ ప్రతినిధుల వేధింపులు తీవ్రంగా పెరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అప్పుల చెల్లింపుల కోసం భార్య లత తన బంగారం కూడా కుదువపెట్టినట్లు తెలిసింది. అయినప్పటికీ వేధింపులు తగ్గకపోవడంతో కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి.*ఇంటిని వదిలి వెళ్లిన భార్య… ఒంటరైన భర్త*మైక్రో ఫైనాన్స్ ఒత్తిళ్లు మరింత పెరగడంతో భార్య లత కొంతకాలం క్రితం ఇంటిని వదిలి వెళ్లినట్లు సమాచారం. దీంతో రాజశేఖర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పుల బారం, కుటుంబ విరహం కలిసి అతన్ని మానసికంగా కుంగదీసినట్లు స్థానికులు చెబుతున్నారు.*సెల్ఫీ వీడియో తీసుకుని ఉరివేసుకుని..*అప్పుల బాధ తట్టుకోలేక రాజశేఖర్ సెల్ఫీ వీడియో తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన తెలిసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.*మైక్రో ఫైనాన్స్ వేధింపులపై ప్రశ్నలు*ఈ ఘటనతో మండల కేంద్రంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘వాయిదా ఆలస్యమైతే ఇంత ఒత్తిడి చేయాలా.? ప్రజలను మానసికంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం.? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.మైక్రో ఫైనాన్స్ సంస్థల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఒక కుటుంబం అప్పుల మాయాజాలంలో చిక్కుకుని చిద్రమైపోయింది.అప్పు తీసుకున్నవారికి ఆర్థిక సహాయం పేరుతో ప్రారంభమైన వ్యవస్థ… చివరకు ప్రాణాలనే బలి తీసుకుంటే… దీనిపై సమగ్ర విచారణ అవసరమని ప్రజలు అంటున్నారు.!____

