*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలం పరిధి కొండాపూర్ గ్రామానికి చెందిన ఇప్పల ఆంజనేయులు శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు బాధితుడు తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యనా అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి అతడిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆంజనేయులు నిరుపేద కుటుంబం జీవనోపాధి కోసం కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స ఖర్చులు కుటుంబానికి భారంగా మారాయి. ఈ నేపథ్యంలో అతడి స్థానిక మిత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని దాతలను కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించిన దాతలు ముందుకు వచ్చి ఒక్కరోజులోనే రూ.70 వేల నగదును సమీకరించారు. కాగా ఈ మొత్తాన్ని అత్యవసర చికిత్స నేపధ్యంలో శనివారం బాధితుడి తల్లికి అందజేసినట్లు మిత్రులు తెలిపారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆంజనేయులు కోలుకునేలా మెరుగైన చికిత్సకు ఆర్థిక సహాయం అందించి, నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని మిత్రులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.





