నేటి సాక్షి తిరుపతి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థి, . సంఘాల పోరాటాలను అణచివేయడానికి అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆరోపించారు. గురువారం తిరుపతి బైరాగిపట్టెడలోని సీపీఎం కార్యాలయంలో అన్ని విద్యార్థి సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువతపట్ల అక్రమ కేసులు పెట్టి వేదింపులకు గురిచేస్తోందని, విద్యార్థి సంఘాలకు విద్యాసంస్థల్లోకి అనుమతులు లేకుండా జీఓలు తెచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యువతపై చేస్తున్న అక్రమ దాడులు, కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల9వ తేదీన తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద యువజన పోరును నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ నిరసనకు వందలాదిగా విద్యార్థులు, యువత తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. *ఆ ముగ్గురుకే ఉద్యోగాలు*ఎన్నికల్లో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని ఉన్నత చదువులు పూర్తయ్యేలోపు ఉద్యోగం, ఉపాధి చూపుతామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ మాట మరచిపోయిందని హర్షిత్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముగ్గురుకి మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్కల్యాణ్, విద్యాశాఖా మంత్రిగా నారా లోకేష్లకు మాత్రమే ఉద్యోగ అవకాశం కలిగిందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోందని, వారందరికీ జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. *అప్పుడు అడ్డుకున్నారు.. ఇప్పుడు వదిలేశారు..*గత ప్రభుత్వంలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తుంటే ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేసి అడ్డుకున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు ఆ బకాయిలతో పాటు రెండేళ్లుగా కట్టాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్ను ఎందుకు చెల్లించలేదని హర్షిత్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ పెద్దలకు విద్యార్థులకు మంచి చేయాలని ఆలోచన వుంటే ఇలా వదిలేసేవారాని నిలదీశారు. విద్యార్థులకు న్యాయం జరగాలన్నా, యువతకు మంచి జరగాలన్నీ మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల విద్యార్థి విభాగం, యువజన విభాగాల అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

