నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ‘Fraud Ka Full Stop’ పేరుతో సైబర్ నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ బంజారాహిల్స్లోని TGICC ఆడిటోరియమ్ నుండి వర్చువల్గా ప్రారంభించారు. వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ప్రజలు తప్పనిసరిగా అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా డీజీపీ పేర్కొన్నారు.*’సైబర్ అవగాహన ప్రతి ఇంటికి చేరాలి’ :డీజీపీ*డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, రోజురోజుకు ఆధునాతన పద్ధతుల్లో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. యువత, విద్యార్థులు మోసపూరిత లింకులు, నకిలీ ఉద్యోగ నోటిఫికేషన్లు, మనీ ట్రాన్స్ఫర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచాలని డీజీపీ అధికారులు ఆదేశించారు. కార్యక్రమం కోసం TGCSB రూపొందించిన పోస్టర్లు, వీడియోలు, ఆడియో క్లిప్లను అధికారికంగా విడుదల చేశారు.*’సైబర్ భద్రత మన చేతుల్లోనే ఉంది’ : ఎస్పీ అశోక్ కుమార్*ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, అనుమానాస్పద లింకులు, OTPలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలి. ఆలస్యం చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం తగ్గిపోతుందని ఎస్పీ సూచించారు. విద్యార్థులు నేర్చుకున్న విషయాలను ఇంటిలో పెద్దలు, చిన్నవారికి చెప్పడం ద్వారా సైబర్ అవగాహన విస్తరించాలని అన్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ ప్రచారంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు.*పోస్టర్ ఆవిష్కరణ… ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు*’Fraud Ka Full Stop’ అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించగా, విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహనతో ముందుకు సాగేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, సైబర్ క్రైమ్ ఎస్ఐలు కృష్ణ, దినేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు._____





