నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు ఈరోజు రెబ్బెన పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.అనంతరం ఎస్పీ గారు ఎస్హెచ్ఓ వెంకటకృష్ణతో పాటు స్టేషన్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా రాత్రిపూట పికెటింగ్, ప్యాట్రోలింగ్ను కచ్చితంగా కొనసాగించాలని ఆదేశించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఎలాంటి సడలింపులు లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్ పాల్గొన్నారు.– జిల్లా పోలీసు శాఖ, కుంరం భీమ్ ఆసిఫాబాద్

