సాక్షి,కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల పరిధిలోని ఇందాని, గణేష్పూర్, సోనాపూర్, వాంకిడి, కమాన్ ఎక్స్ రోడ్ ప్రాంతాలలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ను జిల్లా ఎస్పీ నితికా పంత్ స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఎస్పీ, రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, సోలార్ లైటింగ్ సదుపాయాలు కల్పించడం, అవసరమైన చోట్ల రోడ్ బంప్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలను వెంటనే అమలు చేయాలని తెలిపారు.అలాగే రోడ్డు భద్రతకు సంబంధించిన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచనలు, రిఫ్లెక్టివ్ మార్కింగ్స్ సమర్థవంతంగా అమలు చేస్తే వాహనదారులు మరింత జాగ్రత్తగా ప్రయాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.రోడ్డు మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం కూడా అత్యంత ముఖ్యమని ఎస్పీ అన్నారు. పోలీస్ శాఖ మరియు సంబంధిత విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, వాంకిడి సిఐ సత్యనారాయణ, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, వాంకిడి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.





