నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)పర్చూరు పట్టణానికి చెందిన మున్నా అనే యువకుడు పర్చూరు–గుంటూరు రోడ్డులోని బ్రిడ్జి సమీపంలో వాగులో కొట్టుకుపోయిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పర్చూరు ఎస్ఐ జి.వి. చౌదరి తన పోలీస్ సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ చర్యలు ప్రారంభించారు. వాగులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పటికీ ఎస్ఐ చౌదరి ధైర్యంగా వాగులోకి దిగి, బృందం సహకారంతో యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం మునిని పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఎస్ఐ చౌదరి, పోలీస్ సిబ్బంది చూపిన సేవా మనసు, ధైర్యసాహసం ప్రజల ప్రశంసలను పొందాయి. ఈ ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందిస్తూ, ఎస్ఐ చౌదరి చేసిన సాహసోపేత చర్య ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుండటం గర్వకారణమని ఆయన అన్నారు. తక్షణ స్పందనతో యువకుడి ప్రాణాలను కాపాడిన ఎస్ఐ చౌదరి, పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఎమ్మెల్యే ఏలూరి అభినందనలు తెలిపారు.





