సాక్షి వికారాబాద్ : “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ,సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి , ఏఐసీసీ ఇంచార్జీ కార్యదర్శి సచిన్ సావంత్ , మంత్రులు శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కేడర్ శిక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లే వారధులని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “సంఘటన సృజన్” కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి నూతన దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. సమన్వయం, క్రమశిక్షణ, కార్యాచరణతో ముందుకు సాగితేనే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పరస్పర అనుభవాలను పంచుకుంటూ బలమైన సంస్థాగత నిర్మాణం దిశగా కృషి చేయాలని సూచించారు.సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి, చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, మీడియా నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు.ఈ శిబిరం ద్వారా ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత పటిష్టమవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

