నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)నగరపాలక సంస్థ పరిధిలోని మాలవ్యాజీ స్కూల్ నందు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బాలాజి కాలనీలోని మాలవ్యాజీ పాఠశాల నందు ఊట నీరు, మురుగునీరు రాకుండా చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం కమిషనర్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ మాలవ్యాజీ స్కూల్ లో ఊటనీరు, మురుగు నీరు వస్తున్నదని తెలిపారు. దీంతో స్కూల్ ని పరిశీలించి రాకుండా తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నాలుగు సంవత్స రాల క్రితం స్కూల్ దగ్గరలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్, ఇతర నివాస భవనాలు, బలిజ భవన్ స్థానంలో పెద్ద ఊట గుంట ఉండేదని తెలిపారు. ఆ స్థలం పూర్తిగా పూడ్చి ఆఫీస్ కట్టడం వల్ల ఆ ప్రదేశంలో ప్రవహించే ఊటనీరు దిశ మార్చి మాలవ్యజీ స్కూల్ లోగల తరగతి గదులలో ఊటగా ఏర్పడుతున్నదని స్కూల్ సిబ్బంది తెలిపారని అన్నారు. గత సంవత్సరం క్రితం వచ్చిన ఊట నీటిని మరమ్మతులు చేసి పూర్తిగా అరికట్టడం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పుడు మరి ఇంకొక ప్రదేశం లో ఊట నీరు రావడం జరిగిందని తెలిపారు. తిరిగి ఆ నీరు మరో ప్రాంతంలో వస్తుండడంతో ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలో వస్తున్న ఊట నీరును మరమ్మత్తులు చేసి తాత్కాలికంగా దారి మళ్లించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేస్తున్నారని తెలిపారు. పాఠశాల నందు ప్రవహిస్తున మురుగు కాలవ నీరు శాశ్వత పరిష్కారం కొరకు మాలవ్యాజీ స్కూల్ నందు కొత్తగా ఎల్ డిడి.8 లైన్ ఏర్పాటు కు 9.90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని, పనులు కూడా ప్రారంభించడం జరిగినదని తెలిపారు. ఈ పనులను 5 రోజులలో పూర్తి చేసి పాఠశాల విద్యార్థులకు అసౌకర్యం లేకుండా పని పూర్తి చేస్తామని తెలిపారు. కమిషనర్ వెంట డి.ఈ. మధు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.





