నేటి సాక్షి వికారాబాద్:మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్లు, 2025 (VB-G RAM G) ను రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ రద్దు చెయ్యాలని సీఐటీయూ, వ్య.కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ పట్టణంలో నీ ఎన్టిఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, రైతుసంఘం జిల్లా నాయకులు ఆర్. మహిపాల్ మాట్లాడుతూ…పని చేసే హక్కును కల్పించాలన్న సార్వత్రిక డిమాండ్ ఆధారిత చట్టమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చిన జి రామ్ జి బిల్లు ప్రభుత్వ పథకంగా మాత్రమే ఉంటుందని అన్నారు. చట్టబద్ధమైన హక్కులు కార్మికులు కోల్పోతారని అన్నారు.ఈ బిల్లులో పని డిమాండ్కు తగినట్లుగా నిధులను కేటాయించాల్సిన బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటుంది అన్నారు. వ్యవసాయ పనులు ఉధృతంగా వున్న సమయంలో 60 రోజుల వరకు ఉపాధిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వాలను అనుమతిస్తున్న నిబంధన వల్ల అత్యంత అవసరమైన కాలంలో గ్రామీణ కుటుంబాలకు పనులను నిరాకరిస్తూ, వారు భూస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అన్నారు. పని ప్రదేశాల్లో డిజిటల్ హాజరును తప్పనిసరి చేయడం సరికాదని అన్నారు. వేతనాల చెల్లింపుల కోసం బడ్జెట్లో కేంద్ర రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో పంచుకోవాలన్న ఏర్పాటును తీసుకురావడం ద్వారా ఈ బిల్లు కేంద్రం బాధ్యతను తగ్గిస్తోంది.పైగా ఈ పథకానికి ఎంఎన్ఆర్ఇజిఎస్ గా వున్న పేరును జి ఆర్ఎఎం జి (జి రామ్ జి)గా మార్చాలన్న నీచపు ఆలోచన వెనుక బిజెపి-ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ధోరణి ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో విబి-జిఆర్ఎఎంజి బిల్లును తక్షణమే రద్దు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో వ్య.కా.సంఘం జిల్లా అధ్యక్షులు యూ.బుగ్గప్ప,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ,కోశాధికారి బుస్స చంద్రయ్య,రైతు సంఘం సుదర్శన్, నాయకులు సత్యయ్య, ఎండి. హబీబ్, సత్యయ్య, ఉపసర్పంచ్ రఘురామ్,లాలయ్య తదితరులు పాల్గొన్నారు.





