నేటి సాక్షి హుజూరాబాద్ గురుకులం రెసిడెన్షియల్ పాఠశాల వంగరలో చదువుతున్న శ్రీ వర్షిత ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఆత్మహత్యకు పాల్పడిన చిన్నారికి న్యాయం చేయాలంటూ వర్షిత మృతదేహంతో అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన తిరుపతి కూతురు శ్రీ వర్షిత ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక మరణించింది అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన ఆధీనంలో పెట్టుకొని పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ హయాంలో విద్యార్థులు అన్ని రకాల వసతులతో పాటు రక్షణతో కూడిన విద్యను అందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలతో మొదలుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఎలుకలు, కుక్కలు కోతులు కరిచిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతోనే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శ్రీ వర్షిత ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అసమర్ధ పాలనకు విద్యార్థుల జీవితాలు బలవుతున్నాయని అన్నారు. అనంతరం మృతురాలు వర్షిత కుటుంబానికి 50వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట మృతురాలి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న.





