నేటి సాక్షి.( భూమయ్య ):- మండల కేంద్రమైన కొల్చారంలోని బాబా ఫంక్షన్ హాల్ లో సోమవారం మండల శాఖ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎన్నికలలో పార్టీ మద్దతుతో పోటీ చేయబోయే నాయకులు, వారిని బలపరచడానికి వచ్చిన కార్యకర్తలు చేసిన జై తెలంగాణ నినాదంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా హోరెత్తింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలను ఎత్తిచూపుతూ బి ఆర్ ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని, సమిష్టి కృషితో పార్టీ మద్దతు దారులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలను ఎత్తిచూపారు. పోటీదారులు అంతర్గత కలహాలు లేకుండా ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్నారు. స్థానిక ఎన్నికలే రేపటి రాష్ట్ర ప్రభుత్వ గెలుపుకు నాంది అని, ఈ ఎన్నికలలో గెలుపు సాధించి రాబోయే శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు, రవితేజ రెడ్డి, బాగా రెడ్డి , చిట్యాల యాదయ్య , ఆరే రవీందర్, వరిగుంతం సొసైటీ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, ఇతర సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





