– ఎంఐఎంను విమర్శించేందుకే బీజేపీ అతన్ని వాడుకుంటున్నది
– ఎంఐఎం నగర సీనియర్ నేత అన్నేమల్ల సురేష్ హెచ్చరిక
నేటి సాక్షి, కరీంనగర్: మాజీ మేయర్ సునీల్ రావు రాజకీయ జీవితం వెన్నుపోట్లమయమని, ఎంఐఎం పార్టీని విమర్శించినంతమాత్రాన బీజేపీ సునీల్ రావును మేయర్ చేయదని ఎంఐఎం నగర సీనియర్ నాయకుడు అన్నేమల్ల సురేష్ ఆరోపించారు. శనివారం ఎంఐఎం పార్టీ జిల్లా కార్యాలయంలో సురేష్ మాట్లాడారు. సునీల్రావు ఘనచరిత్ర యావత్తు రాజకీయ పార్టీల అగ్రనాయకులకు పూర్తిస్థాయిలో తెలుసని, కేవలం ఎంఐఎంను విమర్శించడానికి మాత్రమే బీజేపీ ఆయనను వాడుకుంటుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో ఎంఐఎం అభ్యంతరాలను తెలిపింది తప్ప, ఎక్కడా తమ పార్టీకి అనుకూలంగా డివిజన్లు డిలీమిటేషన్ కాలేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ సునీల్ రావుతో కుట్రలు చేయిస్తున్నదని విమర్శించారు. అధికారమే పరమావధిగా చరిత్ర తెలుసుకోకుండా సునీల్ రావు ఎంఐఎంను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఎమ్మెస్సార్ ను మొదలుకొని బీఆర్ఎస్ లో వినోద్ కుమార్, గంగుల కమలాకర్ను వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు బండి సంజయ్ ను సైతం సునీల్ రావు చీట్ చేస్తున్నారని విమర్శించారు. మేయర్ పర్సనల్ ట్యాక్స్ పేరిట కలెక్షన్ బాయ్స్ లను పెట్టుకుని, ఏ అపార్ట్మెంటలో ఎన్ని దండుకున్నావో, ఏ డాక్టర్ల దగ్గర ఎన్ని వసూళ్లు చేశావో నిరూపించాలా? అని ప్రశ్నించారు. నీ రాజకీయ స్వార్థానికి నిత్యం పదవుల కోసం పాకులాడే నువ్వు.. మొన్న కాంగ్రెస్, నిన్న బీఆర్ఎస్, నేడు బీజేపీలో చేరి ఎంఐఎంను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.





