( నేటి సాక్షి) జనవరి:19 ప్రతినిధినార్సింగి సర్కిల్ పరిధిలోని గౌలిదొడ్డిలో 111 జీవోను తుంగలో తొక్కుతూ అక్రమంగా సాగుతున్న బహుళ అంతస్థుల భవన నిర్మాణం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవో కేవలం పుస్తకాలకే పరిమితమై, నేలమీద మాత్రం అధికారుల మౌన సమ్మతితో ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి బహుళ అంతస్థుల నిర్మాణాలు కొనసాగుతుండగా సంబంధిత శాఖలు కళ్లుమూసుకుని ఉండటం వెనుక భారీ అక్రమ లావాదేవీలు ఉన్నాయనే స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణను గాలికి వదిలేసి సాగుతున్న ఈ అక్రమాలకు తక్షణమే బ్రేక్ వేయకపోతే ప్రజా ఆగ్రహం తప్పదని అక్కడి ప్రజలు హెచ్చరిస్తున్నారు.అక్రమ భవన నిర్మాణంలో కొకాపేట్ మాజీ కౌన్సిలర్ పాత్ర.?నార్సింగి సర్కిల్ పరిధి గౌలిదొడ్డిలో సాగుతున్న అక్రమ బహుళ అంతస్థుల భవన నిర్మాణంలో కొకాపేట్ మాజీ కౌన్సిలర్కు భారీ చేతివాటం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.నిబంధనలు, జీవోలు తుంగలో తొక్కుతూ నిర్మాణాలు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం వెనుక రాజకీయ అండదండలున్నాయా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన వ్యవస్థే నిస్సహాయంగా కనిపించడం వెనుక మాజీ ప్రజాప్రతినిధుల ప్రభావం పనిచేస్తోందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు బయటపెట్టాలని ప్రజలు,పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.





