( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 18:)*రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల యాదయ్య తో పాటు..సీపీఐ నేత, బీసీ హక్కుల సాధన సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య ఆధ్వర్యంలో పలువురు నేతలు బంద్ నిర్వహించారు. బంద్ నిర్వహణలో భాగంగా చేపట్టిన నిరసనలో సీపీఐ, కాంగ్రెస్, బీసీ హక్కుల సాధన సమితి, ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల యాదయ్య మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంటులో చట్టం చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంలో హేతుబద్ధత లేదని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో.9ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీసీల కడుపు కొట్టేలా అగ్రకులాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు రిజర్వేన్లలో న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. కుల గణన ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని, దాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను న్యాయపరంగా సాధించే మార్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అన్వేషించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి దేవేందర్ గౌడ్, ఏఐటీయూసీ జిల్లా నేత దత్తు నాయక్, మండల సహాయ కార్యదర్శి బ్రహ్మచారి, బీసీ హక్కుల సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. రమేశ్, బీసీ సంఘం నేత టి. చంద్రయ్య, కాంగ్రెస్ నేతలు , కాకి ఈశ్వర్, పాండు నాయక్, ఎమ్మార్పీఎస్ మండల్ అధ్యక్షులు గణేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.




