నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : సింగరేణి లో మొట్టమొదటి ఎన్ కౌంటర్ లో అమరుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి వ్యవస్థాపకుల్లో ఒకరైన అమరజీవి కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు 77వ వర్థంతి సందర్భంగా శనివారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన వర్థంతి కార్యక్రమం శేషగిరిరావు.చిత్ర పటానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సింగరేణి లో ఉద్యోగం కోసం వచ్చిన దేవూరి శేషగిరిరావు ఆనాడు నిజాం నిరంకుశ పాలన లో తీవ్ర నిర్బంధకాండలో ఆనాడు కార్మికులు ఎలాంటి హక్కులు, స్వేచ్ఛ, రక్షణ సౌకర్యాలు లేని దుర్భర పరిస్థితుల్లో, దోపిడీ పీడనకు గురవుతూ బ్రతుకుతున్న చీకటి రోజుల్లో, రోజూ చాలిచాలని జీతాలతో కార్మికుల దుర్భర జీవితాలను చూసి చలించి శేషగిరిరావు కార్మికుల ను చైతన్య పరిచి 1938 లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ను అజ్ఞాతంగా ఏర్పాటు చేసి కార్మిక వర్గ హక్కుల కోసం ఉద్యమాలు చేయడం వల్ల, ఆ పోరాట ఫలితంగా సింగరేణి లో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ రద్దు అయిందని, కార్మికులందరు పర్మినెంట్ కావడం జరిగిందని పేర్కొన్నారు. భూగర్భ గనుల్లోకి మహిళా కార్మికులను దింపడం రద్దు అయిందని తెలిపారు. 1939 లో శేషగిరిరావు నాయకత్వం లో రహస్యంగా మిలిటెంట్ పోరాటాలను ఉదృతం చేయడం జరిగిందని వారన్నారు. 1942 మే 1 న మేడే నాడు అజ్ఞాతంగా కొత్తగూడెం సమీపంలోని హేమచంద్రాపురం అడవుల్లో మొదటి మహాసభ జరిగిందని, యూనియన్ నాయకత్వాన్ని బహిరంగంగా ప్రకటించారని పేర్కొన్నారు. ముగ్దూం మోహియొద్దిన్ నేతృత్వంలో సర్వదేవబట్ల రామనాథం, దేవూరి శేషగిరిరావు, రాజ్ బహదూర్ గౌర్, మనుబోతుల కొంరయ్య, పర్స సత్యనారాయణ, పులిపాక రాజయ్య లతో ఆనాడు యూనియన్ కమిటి ఏర్పాటు అయిందని పేర్కొన్నారు. రామనాథం అధ్యక్షులు గా, శేషగిరిరావు ప్రధాన కార్యదర్శి గా యూనియన్ కార్యకలాపాలను ఉదృతం చేశారని అన్నారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొంటూ సింగరేణి కార్మికోద్యమాన్ని ముందుకు నడిపించిన అమరుడు శేషగిరిరావు అని వారన్నారు. సింగరేణి కార్మికులతో భద్రాచలం సమీపంలో రహస్యం గా సమావేశం ముగించుకుని వెళుతున్న శేషగిరిరావు ను తన అనుచరులు రంగయ్య, పాపయ్య లను ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం తో నెల్లిపాక అడవుల్లో నిజాం రజాకార్ల సైన్యాలు 1948 ఫిబ్రవరి 15 న ఎన్ కౌంటర్ చేసి చంపారని పేర్కొన్నారు. శేషగిరిరావు మరణించిన ఆశయ సాధన కోసం యూనియన్ మరింత పటిష్టంగా ఉంటూ కార్మికుల వెన్నంటి ఉంటూ అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంకా కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు కన్నం లక్ష్మి నారాయణ, ఎం.ఎ.గౌస్, ఎ.వి.ఎస్ ప్రకాశ్, తాళ్ళపెల్లి మల్లయ్య, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొని చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.





