- నిందితుపై కేసు నమోదు
- లుక్ ఔట్ నోటీసు జారీ
- కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ
కనేటి సాక్షి, కరీంనగర్ : ఎమ్మెల్యేకు బెదిరింపులకు పాల్పడడంతో పాటు డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన వివరాల ప్రకారం.. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గత సెప్టెంబర్ నెలలో 28న మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో +447886696497 నుండి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. అందులో నిందితుడు కాల్లో మాట్లాడుతూ తనకు రూ.20 లక్షలు చెల్లించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేను రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తానని, ఆయన గౌరవానికి భంగం కలిగే చర్యలకు పాల్పడతానని బెదిరించాడు. ఎమ్మెల్యే ఇద్దరు పిల్లలను అనాథలు అయ్యేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్లోని భవానీనగర్కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33)గా గుర్తించారు. అతడు ప్రస్తుతం లండల్లో ఉన్నాడని, అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడని ఏసీపీ తెలిపారు. సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్య్కూలర్ జారీ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ వివరించారు.

