- పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
- ప్రతి రోజూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి
- ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో రివ్యూ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..


నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
రాబోయే మార్చి నెలలో జరిగే పదవ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ పై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాబోయే మార్చి నెలలో జరిగే పదవ తరగతి పరీక్షల కోసం ఇప్పటినుండి ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యార్థుల స్థాయిని పెంచి వారి సామర్థ్యాల ప్రకారం మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థులకు ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్టులో పరీక్ష పెట్టాలని, రాబోయే మూడు నెలల పాటు ప్రతి పదవ తరగతి విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఉన్నత పాఠశాలలోనే హెడ్ మాస్టర్ ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకొని పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల విద్యార్థుల కోసం చివరి రెండు పీరియడ్లు రెమిడీయల్ క్లాసెస్ నిర్వహించాలని, ముఖ్యంగా రీడింగ్ స్కిల్ పెంచాలని 8, 9 వ తరగతి విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

