నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ రమేష్ కుమార్ పాత్రో: నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
బ్యాంకు లావాదేవీలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ చెల్లింపులపై అవగాహన కలిగి ఉండాలని ఎస్.బీ.ఐ. నరసన్నపేట మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ డి.మధుసూదనరావు తెలిపారు. వ్యక్తిగత సమాచారం, ఓటీపీ, ఆధార్ నెంబర్ల కోసం బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావనీ గుర్తించాలన్నారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అకౌంటింగ్ అండ్ టేక్సేషన్ విద్యనభ్యసిస్తోన్న విద్యార్థులకు ఆన్ ది జాజ్ శిక్షణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై బ్యాంకులోనే ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలరోజుల పాటు వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిజ్ఞానం పొందేలా డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు ఆదేశాలతో ప్రిన్సిపాల్ మరపట్ల పవన్ సూచనల మేరకు క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధ్యాపకులు దుగ్గివలస రాంప్రసాద్, కొర్రాయి రవి తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో వస్తోన్న మార్పులు, డిజిటల్ బ్యాంకింగ్, వివిధ రకాల దరఖాస్తులు నింపడం, డిపాజిట్, డబ్బులు బట్వాడా చేయడం, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయడం వంటి అంశాలపై ప్రాక్టికల్ గా శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల సందేహాలను చీఫ్ మేనేజర్ నివృత్తి చేశారు.





