–జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ప్రతి మండలం నుంచి ఒక ఉపాధ్యాయురాలికి సన్మానం
ఘనంగా జరిగిన మహిళ ఉపాధ్యాయురాల దినోత్సవం వేడుకలు

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి మండలం నుంచి ఒక మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారని, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని అన్నారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మనం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

