- మండల కేంద్రంలో ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
నేటిసాక్షి, ధర్మపురి : మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అని దళిత సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘాల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మపురి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో భాగంగా సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి సావిత్రి భాయి పూలే అని అన్నారు. విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంఘ సంస్కర్త ఆధునిక భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బహుజనుల పాలిట చదువుల తల్లి సరస్వతి అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో దాసరి పురుషోత్తం, రాందేని మొగిలి, దుర్గం రవీందర్, బొల్లారం పోచయ్య, చందోలి శ్రీనివాస్, బాదినేని వెంకటేష్, బరిగేల ప్రశాంత్, నరేష్, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

