- వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉన్న రెండు పడకల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : కొత్తకోట మండలం పామాపురం గ్రామం, పెబ్బేరు మండలం పాతపల్లె గ్రామాల్లో గత ప్రభుత్వ హయంలో మంజూరు అయి అసంపూర్తిగా మిగిలిపోయిన రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలక్టర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. పామపురం గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం 56 రెండు పడకల ఇళ్ళు మంజూరు కాగా అవి పూర్తి అయి లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తి అయ్యాయి. ఇంకొందరికి అవసరమని గ్రామస్తులు పట్టుబట్టి ఎన్నికల ముందు మరో 25 ఇళ్ళు మంజూరు చేయించుకున్నారు.

వాటిలో ప్రస్తుతం కొన్ని రూఫ్ లెవల్, బెస్మెట్ లెవల్, కొన్ని ఫైనల్ స్టేజికి వచ్చాయని పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య కలెక్టర్ కు వివరించారు. అదేవిధంగా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో 50 రెండు పడకల ఇళ్ళు మంజూరు కాగా అవి అన్ని రూఫ్ లెవల్ పూర్తి అయ్యాయి. గోడలు లేపడం, ప్లాస్తరింగ్ తదితర పనులు పెండింగ్ లో ఉన్నాయి. రెండు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పని అయినంత వరకు యం.బి. తయారు చేసి ఇవ్వాలని కార్యనిర్వహక ఇంజనీరు ను ఆదేశించారు. బిల్లులు చెల్లించడం జరుగుతుందని, ఇళ్ళు నాణ్యతగా నిర్మించి ఉగాది లోపు పూర్తి చేసి ఇవ్వాలని కాంట్రాక్టరు ను ఆదేశించారు. కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య, పెబ్బేరు తహసిల్దార్ లక్ష్మి, ఎంపిఓ రోజా, కాంట్రాక్టరు షణ్ముఖి, తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.





