- 4 నూతన పథకాల అమలు నేపథ్యంలో దళారుల పట్ల ప్రజలు అప్రమత్తగా వుండాలి
- గ్రామ/వార్డు సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నేటి సాక్షి,పెద్దపల్లి(వోడ్నాల తిరుపతి):
గణతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కొత్త కార్యక్రమాల అమలులో దళారులకు ఎటువంటి పాత్ర ఉండదని,దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాలకు అర్హులను గ్రామ/వార్డు సభల ద్వారా ప్రజల సమక్షంలో పూర్తి పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. అర్హుల ఎంపికకు దళారులకు ఎటువంటి పాత్ర ఉండదని, ప్రభుత్వ పథకం ఇప్పిస్తాం డబ్బులు ఇవ్వమంటూ ఎవరైనా వస్తే నమ్మి ప్రజలు మోసపోవద్దని, అటువంటి దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు నేరుగా ఇంటికి వచ్చి వివరాలు తీసుకొని అర్హులైన వారిని ఎంపిక చేసి గ్రామ/వార్డు సభలో ఆ జాబితాను చదివి వినిపించి, ప్రజలందరి ఆమోదంతో సదరు జాబితాను ఫైనల్ చేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు తప్పనిసరిగా అందుతాయని, ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దళారులను నమ్మే మోసపోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.





