నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టిఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ముస్తాపూర్ తాండ వద్ద ముస్తాపూర్ గ్రామానికి చెందిన మోహన్ అనే 28 ఏళ్ల యువకుడు ప్రయాణిస్తున్న బైకును వెనుక నుండి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు మోహన్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ గ్రామస్తులు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న లింగంపేట పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గ్రామస్తులను కుటుంబ సభ్యుల్ని సముదాయించి ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు సమాచారం.





