- ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలి
- మీ కుటుంబ క్షేమం కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పక ధరించండి
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రహదారుల భద్రతే.. జీవితాలకు రక్షణ గా నిలుస్తుందని ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ – రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం జాతీయ రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్,అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, కొత్త చేరువు, చంద్రంపేట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తనవంతు బాధ్యత గుర్తించాల్సిన అవసరం వుందని అన్నారు. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహనాలను నడపడం ఒక హీరోయిజంగా భవించవద్దని, అలసత్వం వలన జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని, వాహనదారుడు క్రమశిక్షణతో వాహనలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకోవచ్చని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని అన్నారు.

వాహనదారులు జరిమానాలు పడ్డాయని అనుకోకుండా వుండాలంటే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అలాగే రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన ద్వీచక్రవాహనదారులు మరణించడం జరుగుతోందని, కావున ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనం నడపాలని అన్నారు. జాతీయ రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియమలపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, వీరప్రసాద్, ఆర్.ఐ రమేష్, ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.




