- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఇటిక్యాల రైతుల వినతి
నేటిసాక్షి, రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని చింతల చెరువు, లక్ష్మి సాగర్ చెరువుల్లో నీరు అడుగంటిందని, ఎస్ ఆర్ ఎస్ పి నీటి తో చెరువులు నింపాలని కోరుతూ ఇటిక్యాల గ్రామ రైతులు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి నీటి పారుదల శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఇటిక్యాల గ్రామ రైతుల సాగు కు ఆధారమైన చింతల చెరువు, లక్ష్మి సాగర్ చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో ఇటు వ్యవసాయానికి సాగు నీరు అందక, భూగర్భ జలాలు తగ్గిపోయి తాగు నీటి ఎద్దడి తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. డి49, డి50 తూముల ద్వారా చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరగా ఎమ్మెల్సీ అధికారులకు సూచించారు. తమ సమస్య పరిష్కరించేందుకు తక్షణమే స్పందించి, అధికారులతో మాట్లాడి, చెరువులు నింపేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఇటిక్యాల రైతులు ఏలేటి జలంధర్ రెడ్డి, కొక్కెర చంద్రశేఖర్, అంతడుపుల లక్ష్మణ్, ఏలేటి రాజారెడ్డి, సోమ సాగర్ రెడ్డి తదితరు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.




