- ఏఎంసీ డైరెక్టర్ పోలోజు శ్రీనివాస్ విశ్వకర్మ
నేటిసాక్షి, వెల్గటూర్ : భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ. 12000 /- అందజేయడం, ఈ పథకానికి సంబంధించిన వివరాలు వెంటనే గ్రామాల్లో సేకరించడం, అత్యంత హర్షనీయమని ఉమ్మడి వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలోజు శ్రీనివాస్ విశ్వకర్మ పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పరిపాలనలో వ్యవసాయ కూలీలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో వ్యవసాయ కూలీలను గుర్తించి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అసలైన వ్యవసాయ కూలీలను గుర్తించడం పట్ల రాష్ట్ర ప్రజలంతా హర్షద్వనాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అర్హులైన ప్రతి ఉపాధి హామీ కూలీ కుటుంబానికి రెండు విడతల్లో సంవత్సరానికి 12000 /- చెల్లిస్తుంటే, ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వంపై బురద చల్లే వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులంతా ఇందిరమ్మ రైతు భరోసా పథకానికి అసలైన లబ్ధిదారులను గుర్తించే పనిలో నిమగ్నమవడం పట్ల ధర్మపురి నియోజకవర్గ ప్రజలంతా అభినందిస్తున్నారని ఆయన తెలిపారు.




