- మోటివేషనల్ స్పీకర్ కజాంపురం దామోదర్
నేటిసాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ & కాలేజ్ లో స్వర్ణలత అధ్యక్షతన సంస్కార వికాస శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోటివేషనల్ స్పీకర్ హనుమకొండ జిల్లా సి.డబ్ల్యు.సి సభ్యులు కజాంపురం దామోదర్ హాజరయ్యారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఏ రంగంలో అయితే వారికి ఆసక్తి ఉందో ఆ రంగంలో ఏం సాధించాలని అనుకుంటున్నారో దానిపై ఒక చక్కటి ప్రణాళిక రచించుకొని ఆ ప్రణాళిక ప్రకారం నిరంతరం కృషి చేయాలని,మధ్యలో ఎన్ని అవంతరాలు ఎదురైనా పట్టుదలతో పట్టు విడవకుండా సాధించాలని కలలు కన్నా దానిని సాధించేవరకు విశ్రమించకూడదని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా అభివృద్ధి చెందాలనే తపనను అలవర్చుకోవాలని ఆ తపన ఉంటే వ్యక్తిగతంగా, సామాజికంగా విద్యార్థులు తప్పకుండా ప్రయోజకులు అవుతారని,అంతేకాకుండా విద్యార్థులు చదువుతోపాటు, సహవిద్యా కార్యక్రమాలపై కూడా ఆసక్తి కనబరచాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తును నాశనం చేసే తప్పుడు మార్గాల్లో పయనించవద్దని,జాగ్రత్తగా ఉండాలని,భవిష్యత్తు అభివృద్ధికి ఉపయోగపడే అలవాట్లను అలవర్చుకోవాలని,దేశభక్తిని పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు, పెద్దవారిపట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని,సామాజిక సేవా దృక్పథంతో ముందుకు వెళ్తూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.





