- బి ఆర్ యస్ జిల్లా నాయకులు బండారి సునంద్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల్:జిల్లా కేంద్రంలో బి ఆర్ యస్ జిల్లా నాయకులు బండారి సునంద్ మాట్లాడుతూ మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది.
ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ గారు విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణం. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారు. మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా, ఆరు గ్యారెంటీలు అమలు దగా, రుణమాఫీ చేయడం దగా, పంట బోనస్ ఇవ్వడం దగా, రైతు భరోసా అమలు దగా, రేషన్ కార్డుల జారీ దగా, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా, ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నరు. మీరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నరు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నది. అడుగడుగునా ప్రశ్నిస్తున్నది. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతరు. ఎంత మందిని అరెస్టులు చేస్తరు. మీ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని బండారి సునంద్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో రఫీ లు మరియు బండారి సునంద్, ప్రేమ్ రాజ్ లు పాల్గొన్నారు.





