నేటి సాక్షి, బెజ్జంకి : మండలంలోని రేగులపల్లిలో గురువారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులైన వారిని గుర్తించలేదని గ్రామస్తులు, బిఆర్ఎస్, సిపిఎం, బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు లేని 535 మంది దరఖాస్తు చేసుకోగా, 367 మందిని మాత్రమే ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, అర్హులైన అనేక మంది జాబితాలో లేకపోవడంతో నిరుపేదులు నిరాశ చెందారు. అధికారులను ప్రశ్నించినప్పటికీ, వారు మొబైల్ యాప్ తప్పు అని సమాధానం ఇచ్చారు. ఆత్మీయ భరోసా పథకంలో 83 మందిని ఎంపిక చేసినప్పటికీ, కొంతమంది వ్యవసాయ భూమి ఉన్నవారు ఉండటంతో, నిజమైన భూమిలేని పేదలను గుర్తించాలని గ్రామస్థులు కోరుతున్నారు. నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన 120 మందిలో కేవలం 46 మందికి మాత్రమే కార్డులు మంజూరు చేయడం జరిగింది. గ్రామంలోని బిఆర్ఎస్, సిపిఎం, బిజెపి నాయకులు ఈ జాబితాలను పునఃసమీక్షించి, అర్హులైన పేదలను గుర్తించి నూతన జాబితాను తయారు చేయాలని అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దుంభాల రాజామహేందర్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, బిజెపి నాయకులు నూనె ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు మాతంగి రజనీకాంత్, తాళ్ల స్వామి, కొట్టే శ్రీనివాసరెడ్డి, కుమ్మరి శ్రావణ్, వంగమోహన్ తదితరులు పాల్గొన్నారు.





