- కానిపర్తి గ్రామంలో నెలకొన్న గందరగోళం

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామంలో ప్రభుత్వ ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాను, అధికారులు చదవగానే గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఆ జాబితాలో అనర్హుల పేర్లే ఎక్కువగా ఉన్నాయని, అర్హులైన వారి పేర్లు లేవని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ పథకాలన్నీ అధికారులు ఉన్నవారికి కట్టబెడుతున్నారని, నిరుపేదల పైన అధికారులు వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్షేత్ర స్థాయిలో అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరారు. ప్రభుత్వ రాజకీయ నాయకుల అండదండలతో, అధికార పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి అనర్హులైన వారికి, ఆర్థికంగా ఉన్నవారికి వచ్చేలా నిరుపేదల పథకాలను బలవంతంగా పొందుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అండగా ఉండాలని వారు ఆకాంక్షించారు. కానిపర్తి గ్రామంలో అధికారులు చదివిన జాబితా సరిఅయింది కాదని దానిని పునపరిశీలించి పేదలకు న్యాయం జరిగేలా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





