నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి, ఉత్తమ జిపిఎ సాధించాలని సింగరేణి పాఠశాలల సెక్రటరీ కొత్తగూడెం జి శ్రీనివాస్ కోరారు. గురువారం పట్టణంలోని పాఠశాలను సందర్శించి తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, భోజన వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ఎక్కువ గ్రేడ్ పాయింట్స్ సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాలలోని వివిధ విభాగాలలోని పనితీరును పరిశీలించి, వివిధ రంగాలలో బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రశంసించి, వారికి బహుమతులు అందించి ప్రోత్సహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు వడ్డించడమే కాకుండా స్వయంగా రుచి చూశారు. ఇటీవల జరిగిన సీఎం కప్, సైన్స్ ఒలంపియాడ్ లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. పాఠశాలలో కర్మచారిని కమల, మధ్యాహ్న భోజన సిబ్బందిని శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎస్ శ్యాంసుందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె పురుషోత్తం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.





