- అధైర్యపడకండి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.
- రేపటి నుండి నాలుగు పథకాలు ప్రారంభం.
- సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని కాంగ్రెస్ నాయకులకు ప్రణవ్ సూచన.
- కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే వా ? వీధి రౌడీవా?
- గ్రామ సభలో ప్రజలు నిన్ను తిరస్కరించారు. దాన్ని ప్రెస్ మీట్ పెట్టీ మరి చెప్పడం హాస్యాస్పదం.
నేటి సాక్షి, జమ్మికుంట :
గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న గ్రామ సభలలో ప్రజలు నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలాగా చూస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం రోజున జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కౌన్సిలర్లుగా ఐదు సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవీ లేకపోయినా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకే గ్రామ సభలు నిర్వహించామని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చూసి ఓర్వలేని స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు ఒక్కరోజు కూడా ఇలాంటి గ్రామసభలు గ్రామాల్లో నిర్వహించలేదని, నిర్వహించకపోగా తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్వలేకనే చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల పాటు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ప్రాంతంలో ఏ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులైన పేద ప్రజలకు ఇచ్చాడా అని ప్రశ్నించారు. ప్రజలు ఎవరు అధర్యపడవద్దని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వీధి రౌడీ లాగా ప్రవర్తించి హుజురాబాద్ పరువు తీస్తున్నాడని, ఇకపై కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదే లేదని తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు గ్రామ సభల్లో ప్రజలే ఎమ్మెల్యేను స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్, దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని త్వరలోనే జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవి స్వీకరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు.
కౌశిక్ రెడ్డి తీరు సిగ్గుచేటు…
తనపై దాడి జరగలేదని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టీ మరీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రణవ్ అన్నారు. ప్రజా సమస్యలపై, పథకాలపై ప్రజలకు వివరించాలి కానీ మీడియా వేదికగా తనపై ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తపరిచిన తీరు పట్ల స్పందించడం కౌశిక్ రెడ్డి అవివేకతనానికి నిదర్శనమని, మరోవైపు ప్రజలు తిరస్కరించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అయినవని ఒక్కసారి కౌశిక్ రెడ్డి వాటిని చూసుకోవాలని సూచించారు. పబ్లిసిటీ కోసం,రీల్స్ కోసం ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని కౌశిక్ రెడ్డికి రాబోయే రోజుల్లో హుజురాబాద్ ప్రజలే తన ప్రవర్తన పట్ల తగిన బుద్ధి చెప్తారనీ అన్నారు.





