- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా నుండి ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, ఉద్యానవన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, బ్యాంకింగ్, వ్యవసాయ శాఖల అధికారులతో జిల్లా ఉత్పత్తుల ఎగుమతి అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ, పరిశ్రమల రంగాలను ప్రోత్సహిస్తూ ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంపొందించే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేస్తూనే అధిక మొత్తంలో ఉత్పత్తుల ఉత్పాదకతను పెంపొందించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా కృషి చేయాలని తెలిపారు. ఉత్పత్తుల ఎగుమతిని పెంచే విధంగా అధికారులు కార్యచరణ రూపొందించి ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. మామిడి, వరిధాన్యం ఎగుమతులపై అధిక దృష్టి సారించాలని, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్-స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం క్రింద కార్పెంటర్, బోట్ మేకర్, బ్లాక్స్మిత్, పనిముట్ల తయారీ, లాక్ స్మిత్, శిల్పకారులు, స్వర్ణకారులు, కుమ్మరులు, పాదరక్షల తయారీ, మేస్త్రిలు, బుట్టల తయారీ, దర్జీలు, దోభిలు, మంగలి ఇతర వృత్తులకు సంబంధించి ఆర్థిక చేయూత అందించడం ద్వారా కులవృత్తుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని, పథకంపై ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





